అదిలాబాద్,అర్జున్ సమాచారం:
ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామంలో గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన 21 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న జిల్లా ఎస్పీకి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
యువత గంజాయికి దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామంలో అన్ని మతాల ప్రజలు పరస్పరం సోదరభావంతో, ఐకమత్యంగా ఉంటూ శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ ఎస్హెచ్ఓ కె. నరేష్ కుమార్, గ్రామ సర్పంచ్ షేక్ ఇమ్రాన్, గ్రామ పెద్దలు, పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.